File No. 2

File: 2 [ప్రార్థన:  ఓం బ్రహ్మానందం    ఓం పూర్ణమదః పూర్ణమిదం    ఓం సహనావవతు]

            విషయసూచిక ముందు పరిచయ వాక్యాలలో చిట్టచివరి paragraph చూడండి. చదవండి. “సాధన చతుష్టయ సంపన్నులై, శాస్త్రాధ్యయన తత్పరులై, ధార్మిక జీవనం సాగిస్తూ, అంతరంగ శుద్ధిని, నిశ్చల మనోబుద్ధుల శాంత స్థితిని సాధించి, సత్యాన్వేషణకోసమే జీవిస్తున్న ఉత్తమాధికారులకు, అర్హులకు ఈ గీత ఉద్దేశ్యించబడినది. అహంకారాన్ని తద్వారా చూడబడే ప్రపంచపు స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుని భావంలో భావంతో గుర్తింపబడే భావనామయ జగత్తును విడనాడాలనే దృఢ సంకల్పంతో ధీరత్వంతో ఆఖరి అడుగు వేయబోయే సత్యాన్వేషులకు, సాధక శ్రేష్ఠులకు తత్వజిజ్ఞాసులకు మాత్రమే ఇది సరిగా అర్థమౌతుంది.” చూడండి. ఎన్ని లక్షణాలు వుండాలో, అష్టావక్రగీత ముట్టుకోవాలి అని అంటే. అధ్యయనం చేయాలని అంటే, చాలా స్పష్టంగా తెలుగు సేత చేసినటువంటి వాళ్ళు, దీనిని ముందే చెప్పారు. అంటే ఈ ఉత్తమ లక్షణాలు వుంటే తప్ప, యథాతథంగా నీకు అష్టావక్రగీత అర్థం కాదు. దీనికి కారణం వుంది. చిన్న విషయం తెలుసుకోవాలి.

            ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని ఆశ్రయించి, “ఈ అనంత సృష్టి నాచేతనే సృజించబడినది కాబట్టి ఈ సృష్టిలో మొదటివాడను నేనే. ఆద్యంతములు లేక సృష్టంతా వ్యాపించి వున్నవాడను నేనే. కాబట్టి నాకన్న గొప్పవాడు ఈ సృష్టియందు మరొకడు లేడు” అని శ్రీమన్నారాయణునితో సంభాషిస్తే, శ్రీమన్నారాయణుడు సరే అలాగే, ఒకసారి అలా వెళ్ళి పరిశీలించి వద్దాము రండి నడిచి వెళ్ళొద్దాం అన్నాడు. అని కొంత దూరం తీసుకుని వెళ్ళగా, ఒక చోట ఒక మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు. ఆయన రోమశ మహర్షి. ఆ రోమశ మహర్షి పక్కన గుట్టగా రోమాలు పడి వున్నాయి. ఆయన ఎంత ఎత్తు వున్నాడో, ఆయన పక్కగా పడి వున్నటువంటి రోమాలు కూడా అంత ఎత్తు గుట్ట వున్నది. ఈ మహానుభావుడు ఎవరూ అని వారు అడుగుతారు. వారినే మనం అడుగుదాం అని వారి దగ్గరకి వెళ్తే, వారు వారిని పరిచయం చేసుకుంటారు. అయ్యా! నేను రోమశ మహర్షిని. అప్పుడు ఈ బ్రహ్మగారికి ఒక సందేహం కలిగింది. అయ్యా! మీ ప్రక్కనే ఈ రోమాల గుట్ట ఏమిటి అని? నాలుగు మహాయుగాలు అంటే కృతయుగము, త్రేతాయుగయు, ద్వాపరయుగము, కలియుగము ఇవి నాలుగు కలిపితే ఒక మహాయుగము. ఇటువంటి మహాయుగాలు అన్నీ కలిపి బ్రహ్మకు ఒక పగలు, మళ్ళా ఇంకో మహాయుగం కలిపి ఒక రాత్రి. అలాంటి వంద సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఆయుర్దాయం నిండుతుంది. అంటే ఒక బ్రహ్మ గారు వెళ్ళి పోయి మరొక బ్రహ్మగారు వస్తారు. ఒక్కొక్క బ్రహ్మగారు వెళ్ళిపోయినప్పుడల్లా ఒక రోమం వూడి పడిపోతుంది ఆయనకి. ఇప్పుడు ఆ పక్కనున్న రోమాలన్నీ ఏమిటీ అని అంటే, అంతమంది బ్రహ్మలు వెళ్ళి పోయారు. అని రోమశ మహర్షిగారు చెప్పారు. అప్పుడు ఈ బ్రహ్మగారికి ఏమనిపించింది? ఓహో! సరే, ఇంకా వెళదాం పదండీ అన్నారు. ఇక తెలుసుకోవడం అయిపోయింది, నేనే గొప్పవాడినికాదనే సంగతి నాకు అర్థమైపోయింది. నేను గొప్పవాడిని కాదని, నాలాంటి వాళ్ళు ఎన్ని వేలు, లక్షల మంది వెళ్లిపోయారో ఆ రోమశ మహర్షి రోమాలు చూస్తేనే తెలిసిపోతుంది. సరేలేండి, ఇప్పుడు ఏమైంది? కొంచెం దూరం వెళ్ళి చూద్దాం అని ముందుకు వెళ్తారు. అక్కడ మరొక మునీంద్రులు, వారు వారి దగ్గరకి వెళ్తే అయ్యా! నమస్కారం. నేను అష్టావక్ర మునీంద్రుడను. మరి మీరేమిటి, మీరు ఎంతకాలం నుంచి తపస్సు చేస్తున్నారు? నాకంటే ముందు రోమశ మహర్షిగారు వున్నారు. వారి ఒంటి మీద వున్న రోమాలు అన్నీ పడిపోతే, రోమశ మహర్షిగారు వుండరు. వారు చాలిస్తారు. అటువంటి రోమశమహర్షిగారు ఒక్క రోమశ మహర్షిపోతే నాకు వున్నటువంటి 8 వంకర్లలో ఒక వంకర పోతుంది. ఇప్పటికి ఇంకా ఒక వంకర కూడా పోలేదు. అన్నారు. వీళ్ళందరూ చిరంజీవులన్నమాట. ఆ మాట చెప్పడం కోసం. అంటే సృష్టి వున్నంతకాలం, విశ్వ సృష్టి వున్నంతకాలం వీళ్ళందరూ వుండే వాళ్ళే. అందుకే ధృవమండలం ఎప్పటికీ పడిపోదు. మన పెద్దవాళ్ళు అందుకే ఇదంతా చెప్పకుండా, ఇదంతా అర్థం కాదని, ఏం చెప్పారుసప్త ఋషులు అనేవాళ్ళు ఎప్పటికీ వుంటారు. ధృవమండలం ఎప్పటికీ పడిపోదు. ఇలాగ పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం అది. ఇలాగ మహానుభావులు అనంత సృష్టికి, దైవీ ప్రణాళికకు ఆధారంగా వుంటారు. మైత్రేయుడు ఇలా చాలా మంది వున్నారు. వీళ్ళందరూ కూడా నిరంతరాయంగా ఆ దైవీ ప్రణాళికలో ఎప్పుడూ వుంటారు. వాళ్ళు ఆ దైవీ ప్రణాళికను నిర్వహిస్తూ వుంటారు. వీళ్ళు ప్రత్యేకంగా చేసేది ఏమైనా వుందా ఇప్పుడు? ఎందుకని? సంకల్పమే అనంత సృష్టికి ఆధారం. కాబట్టి అటువంటి మహానుభావుడు చెప్పినటువంటిది ఈ గీత. ఇదంతా ఎందుకు చెప్పుకున్నాము అనంటే, అష్టావక్ర మహర్షి అంటే చాలా మంది 8 వంకరలు అనే వరకే తెలుసు అందరికి. ఎందుకంటే పేరు లోనే వుంది కాబట్టి. ఆయన తపః శక్తిగానీ, ఆయన యొక్క ధీ శక్తి గానీ, ఆయన ఉద్ధరించగలిగేటటువంటి శక్తి ఎంతటిది అని తెలియాలంటే, ఇప్పుడు ఆయన ఎంతకాలం నుంచి వున్నారు? ఆయన జనకరాజర్షికి బోధించారు ఈ అష్టావక్రగీత.

            నిన్న మాట్లాడుకున్నాం. గురు కృపా వీక్షణ లేశమ్ము చేత నీకు జ్ఞానం కలుగుతుంది. జనక రాజర్షినే మనం అందరం ఏమనుకుంటున్నాం? జనకుడు వంటి మహానుభావుడు భూమండలం మీద మళ్ళా ఇంతవరకూ పుట్టలేదు అన్నారు. అటువంటి రాజర్షి ఇంతవరకూ మళ్ళా పుట్ట లేదు. ఏనాటి కాలం వాడు? త్రేతాయుగం నాటి కాలం వాడు. అర్థమైందా! మరి ఏ త్రేతాయుగమో లెక్క వుందా? మన త్రేతాయుగమా? ఇన్ని మహాయుగాలలో ఈ నాలుగు యుగాలలో వున్నటువంటి వాడేనా? ప్రతి త్రేతాయుగంలో ఒక రాముడు, ప్రతి త్రేతాయుగంలో ఒక జనకమహారాజు, ప్రతి త్రేతాయుగంలో ఒక రామాయణం జరిగిపోతూనే వుందిగా, కాబట్టి ఇలా మనం పౌరాణిక దృష్టితో చూస్తే, ఇప్పుడు ఆ అష్టావక్ర మునీంద్రులు ఎక్కడ? ఈ జనక రాజర్షి ఎక్కడ? అటువంటి అష్టావక్ర మునీంద్రుడు ఈ జనక రాజర్షికి బోధించాడు. ఆయన తపఃశక్తి ఇప్పుడు ఎంత? వేల లక్షల కోట్ల సంవత్సరాలు, లెక్కెట్టడానికి వీలు కానంత కాలం వాళ్ళు చిరంజీవులుగా వుండి, అదే పని, దైవీప్రణాళికను నిర్వహించడం అనే పనిలో వున్నారు. అటువంటి మహానుభావుడు ఇప్పుడు ఆయనకు ఏమని పేరు పెడదాం? సద్గురువు అందామా? జగద్గురువు అందామా? సరిపోతాయా ఈ పేర్లు? చాలటం లేదుగా. ఎందుకనిట? ఆ కథ చెబుతోంది. అర్థమైందా అండీ? ఎన్ని వందల, వేల మంది బ్రహ్మలు నశిస్తే, ఒక రోమశుడు పోతాడు. ఒక రోమశుడు పోతే, ఒక వంకర పోతుంది. మరి ఇప్పుడు ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలో లెక్కెడతామా? చాలటం లేదు. అటువంటి మహానుభావుని యొక్క కృపా వీక్షణ లేశమ్ము చేత, ఎందుకనిట?

            ఒక రికాబులో కాలు పెట్టి, మరొక రికాబులో కాలు పెట్టే లోపల జీవన్ముక్తి కలిగింది జనక మహారాజుకు, జనక రాజర్షికి. ఎలా సాధ్యం అయ్యింది అది? అంటే ఇప్పుడు ఆయన ప్రతిభా పాటవాల? అష్టావక్రుని ప్రతిభా పాటవమా? అర్థమైందా అండీ! ఇట్లా జీవన్ముక్తి ఎంత సేపటిలో కలుగుతుంది? గుర్రం మీద కాలు పెట్టి ఒక రికాబులో, (ఎక్కేదాని మీద కాలు పెట్టి) మరొక కాలు పెట్టే లోపల జీవన్ముక్తి కలుగుతుంది. దేని వల్ల? గురుకృపా వీక్షణ లేశమ్ముచేత. మరిప్పుడు మనం జీవన్ముక్తికి ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించాలని మన అభిప్రాయం? అర్థమైందా? అంటే ఎక్కడుంది సమస్య? అంటే, అందుకే ఈ చివరి paragraph చదవమన్నారు. మన దగ్గర ఏమి వుండాలట అష్టావక్ర గీత పట్టుకోవాలి అంటే, సాధన చతుష్టయ సంపన్నులై, ఇవన్నీ ఇంతకు ముందు మాట్లాడుకున్నాము. అయినా ఒకసారి గుర్తుచేసుకుందాము. సాధన చతుష్టయ సంపన్నులై వుండాలట. నిరంతరాయంగా మీ దగ్గర ఏముండాలట సంపద అంటే, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, శమాదిషట్క సంపత్తి, ముముక్షత్వము ఈ నాలుగు సాధనచతుష్టయము. మన దగ్గర ఏమి వుండాలి? మన దగ్గర మిగిలిన సంపదలు వుంటే లాభం లేదు. అష్టావక్రగీత నీకు స్వాధీనం అవ్వాలి అనంటే, నీకు తెలియాలి అంటే, అనుభవంలోకి రావాలి అనంటే, నీకు ఆ సాధన చతుష్టయంలో ఎడతెగని సంపద వుండాలి. శాస్త్రాధ్యయన తత్పరులై, తత్పరులై అంటే, తత్వదర్శనం అనేటటువంటి దృష్టితో శాస్త్రాన్ని చదవడం. శాస్త్ర దృష్టితో తత్వాన్ని తెలుసుకోవడం కాదు. తత్వ దృష్టితో శాస్త్రాన్ని చూడగలిగేటటువంటి అధ్యయనపరులై, ధార్మిక జీవనం సాగిస్తూ, అంటే ధర్మమే అధారం, అలాంటి జీవనం సాగిస్తూ, అంతరంగా శుద్ధిని - ఇటువంటి వాడికి అంతరంగం శుద్ధి కాకుండా వుంటుందా? అయినా మరి ఈ మాట ఎందుకు అన్నారు? ఎక్కడైనా, ఎంత ధర్మం ఆధారంగా జీవిస్తూ వున్నా అనంత సృష్టికి సంబంధించి నటువంటి లవలేశమైనా కూడా ప్రారబ్దంలో మాలిన్యం వుండే అవకాశం వుంది కాబట్టి, దానిని అంతరంగ శుద్ధి అన్నారు. నిశ్చల మనోబుద్ధుల శాంత స్థితిని, మనసు బుద్ధి రెండు లక్షణాలను కలిగి వుండాలి. నిశ్చలంగా వుండాలి, శాంతంగా వుండాలి. ఇప్పుడు ఈ రెండిటిలో ఏది ముందు? చూడండి అక్కడ ఏమి వుందో? మనం ఇప్పుడు ఏ స్థితిలో వున్నాము? మనోబుద్ధులను నిశ్చలం చేయడానికి ప్రయత్నిస్తున్నామా? శాంతంగా వుంచడానికి ప్రయత్నిస్తున్నామా? (శాంతిగా వుండడానికి ప్రయత్నిస్తున్నాము). శాంతాన్ని ప్రయత్నిస్తున్నాము. మరి ఆయనేమంటున్నారు? ముందు నిశ్చలం అయితే కదా! అసలు శాంతంగా వుండడం అనేది? అర్థమైందా! దాన్ని ఏదో ఒక కట్టు కొయ్యకి కట్టేస్తేనే, అది శాంతం అవుతుంది. కట్టుకొయ్యకే కట్టేయపోతే, ఎప్పటికీ శాంతం అవదు. అవునా కాదా? కాబట్టి నిశ్చల మనోబుద్ధులు వుండాలి. వున్నవి కూడా మళ్ళా ఎలా వుండాలి? కట్టుకొయ్యకు కట్టేసే పని లేకుండా శాంతంగా వుండాలి. కట్టుకొయ్యకు కట్టివేసినా కూడా శాంతం లేనట్టే. దీంట్లో వున్నటువంటి అంతరార్థాన్ని లోపలికి వెళ్ళే కొద్దీ మనం విచారణ చేస్తాము.

            సత్యాన్వేషణ కోసమే జీవిస్తున్న ఉత్తమాధికారులు - నీ జీవన లక్ష్యం ఏమై వుండాలట? సత్యాన్వేషణ. సత్యం అన్నా భగవంతుడు అన్నా రెండూ ఒక్కటే. సద్గురువు అన్నా, సత్యం అన్నా, భగవంతుడన్నా, పరమాత్మ అన్నా, పరబ్రహ్మం అను, బ్రహ్మ అను ఇవన్నీ ఒక్కొక్కటి స్థితి భేదంగా పెట్టుకున్న పేర్లు. అంటే నా జీవితం దీని కొరకు మాత్రమే. ఇక మిగిలినటువంటివి నా జీవితంలో సాధించవలసినవి ఏమీ లేవు. చేయవలసినవి ఏమీ లేవు. నా కర్తవ్యం అంటూ ఏమీ లేదు. కేవలం ఇది ఒక్కటే. అనేటటువంటి వాళ్ళు ఎవరైతే వున్నారో, వాళ్ళు ఎవరట? ఈ పై లక్షణాలు వున్నవారందరికీ కలిపి ఒక పేరు వుంది ఏమిటంటే అది, ఉత్తమాధికారి.

            ఇప్పుడిది మరి మీరు బోధించ పూనుకుంటున్నారు. అక్కడ మీరు ఎవరు? అక్కడ మీరు ఇప్పుడు హైదరాబాదులో ఏం చేయబోతున్నారండీ? అష్టవక్రగీతను బోధించపూనుకున్నారు. అంటే మీరిప్పుడు ఏ స్థితిలో వుండాలి అనేది మీరు విచారణ చేసుకోవాలి. అర్హులకు, ఈ ఉత్తమాధికారి అనేవాడే దీనికి అర్హుడు. చాలా ముఖ్యం అండి. ఈ గీత ఉపదేశించ పూనుకున్నారు. అహంకారాన్ని తద్వారా చూడబడే ప్రపంచ స్వభావాన్ని, చక్కగా అర్థం చేసుకుని, చూడండి! ఎక్కడ మాట్లాడుతున్నారో... ఎక్కడినుంచి చూడాలట? అంతఃకరణ చతుష్టయంలో అహంకారమే ఆధారం. దాని అవతల? జ్ఞాత. అంటే జ్ఞాతకి అహంకారానికి మధ్యలో పట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఎక్కడ పట్టుకున్నాము? మనస్సుకి ఇంద్రియాలకి మధ్యలో పట్టుకున్నాము. ఎక్కడ పట్టుకోవాలట దానిని? జ్ఞాత అహంకారంగా మొదటి ప్రతిబింబం ఏదైతే ప్రతిబింబిస్తుందో, ఆ మొదటి ప్రతిబింబాన్ని గనుక నువ్వు నివర్తించగలిగితే, అప్పుడు ఏమైంది? అంటే, తద్వారా చూడబడే ప్రపంచపు స్వభావం. అహం దృష్ట్యా చూడబడుతున్న ప్రపంచపు స్వభావాన్నంతా తర్వాత నువ్వు అంతఃకరణంతో విమర్శిస్తున్నావు. చూస్తున్నావు. ఈ ప్రపంచం అలా వుంది, ఈ ప్రపంచం ఇలావుంది. అలా నీకు ఎటువంటి దృష్టి వుంటే, అలా నీకు ఈ ప్రపంచం కనపడుతుంది. కాబట్టి అహంకార మూలాన్ని తెగ్గొట్టడానికి మాత్రమే ఉపయోగపడేది ఇది. అహంకార ప్రతిబింబాలైనటువంటి మనోబుద్ధి చిత్తాల జోలిని అధిగమించడానికి, వీటిని అధిగమించి అహంకార మూలాన్ని తెగ్గొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళకి ఇది ఉపయోగం. ఎలాగ? అంటే, చూడండి. భావంలో, భావంతో గుర్తింపబడే భావనామయ జగద్భ్రమను విడనాడాలనే దృఢసంకల్పంతో... ఎటువంటి దృఢ సంకల్పం కావాలండీ? ఈ సృష్టి అంతా భావనామయ జగత్తు. ఈ సత్యం తెలిసి దీని మూలాన్ని తెగ్గొడితే, ఎవరు లేకుండా పోయారు? నువ్వు లేకుండా పోయావు. ధీరత్వం - ధీరత్వమంటే, సింహ హృదయం. ఎటువంటిది వుండాలండీ? సింహహృదయం కావాలి. ఎందుకని అలా అన్నారు?

            అంటే మనకి ఉదాహరణ చెప్తారు. బయట ఒక కాకి అరిచింది అనుకోండి, ఏమి వస్తాయి? అనేక కాకులు వస్తాయి. అంతేనా అండీ? అది ఎవరైనా పట్టించుకున్నారా? ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏ జంతువు అయినా పట్టించుకున్నాయా? కాకులు అరవడం మామూలే, ఇతర కాకులు రావడం కూడా మామూలే. అదే ఒక సింహం గర్జించింది అనుకోండిఅప్పుడు ఆ గర్జన వినపడినంత దూరం, ఒక్క జీవి కూడా అక్కడ వుండదు. కాబట్టి ధీరత్వం అంటే ఆ గురువాక్యం అనేటటువంటి సింహగర్జన తద్వారా నీ అహంకార మూలం తెగిపోవాలి. అది ధీరత్వం అంటే. ఆ గురువాక్యం మీదే నిలబెట్టగలగాలి. దేన్ని? జ్ఞాతని. నీలో వున్నటువంటి సాక్షి, గురువాక్యాన్ని ఆశ్రయించి పనిచేయాలి. అర్థమైందా అండీ! అప్పుడే అహంకార మూలాన్ని తెగ్గొట్ట గలుగుతావు. కాబట్టి దీనికి ఏం కావాలి? దృఢ సంకల్పం వుండాలి. అలాగే ధీరత్వం వుండాలి. చూడండి ధీరత్వంతో ఆఖరి అడుగు వేయబోయే సత్యాన్వేషులకు ప్రయాణంలో ఆఖరి మెట్టు ఏమిటి? నిన్ను లేకుండా చేసుకోవడం. అదే ఆఖరి మెట్టు. అలాంటి వాళ్ళు ఉపయోగం ఇది. సాధక శ్రేష్ఠులకు, తత్వ జిజ్ఞాసులకు మాత్రమే ఇది సరిగా అర్థం అవుతుంది. ఇన్ని ఉత్తమ లక్షణాలు వున్నవారందరికి కూడా ఇది చిట్టచివరి స్థితిని అందిస్తుంది. అంటే మిగిలినవాళ్ళు చదువవద్దు అనా అర్థం? అలాంటి వాళ్ళకు చరమ గమ్యాన్ని అందించే సామర్థ్యం ఇందులో వుంది కాబట్టి, దీనిని అంత ఉత్తమంగా, అక్షర సత్యంగా నీవు భావించి స్వీకరించి, అదే జీవితంగా జీవించు.

             వివేకచూడామణిని కూడా పక్కన పెట్టుకుంటే ఇందులో వచ్చిన వన్నీ అందులో చూసుకుంటూ వుంటే మీకు వెంటనే తెలుస్తూ వుంటుంది. ఏది ఎక్కడ వుందో. చూడండి విషయసూచికలో మొట్టమొదటి ఆత్మసాక్షిగా అందరిలో చదవండి ఎవరైనా.. దానిని బట్టి ఇందులో వెదుకుదాం, అక్కడున్నవిషయమే ఇక్కడ వివేకచూడామణిలో కూడా వుంటుంద. కాక పోతే ఇక్కడ మొట్టమొదట ఎత్తుకోవడమే ఎక్కడ ఎత్తుకున్నారండీ? ఆత్మ సాక్షిగా అందరిలో అనేది ఎత్తుకున్నారు. ఇక్కడికి వచ్చేప్పటికి అది ఎక్కడ ఎత్తుకుంటారుచివరలో. కాబట్టి ఆ ముందు వున్నదంతా నీకు తెలిసి వుంటే, ఆత్మ యొక్క సాక్షిత్వాన్ని నిర్ణయించడానికి వీలౌతుంది. (చదవండి)

ఆత్మ సాక్షిగా అందరిలో ... మహా పండితులు, విజ్ఞాని, రాజర్షి అయిన జనకుడు తన సందేహాలను, సమస్యలను ఆత్మ నిష్ఠుడైన అష్టావక్రుని ముందు వుంచి, తీర్చవలసినదిగా ప్రార్థిస్తున్నాడు.”

భగవద్గీత దేనితో మొదలైంది? అర్జున విషాదయోగంతో మొదలైంది. ప్రశ్నలు ఎవరు వేశారు? అర్జునుడు గారు ప్రశ్నలు వేశారు. ఇక్కడ కూడా ప్రశ్నలు ఎవరు వేస్తున్నారు? జనక మహారాజుగారు వేస్తున్నారు. ఎవరిని? జనకమహారాజుగారి యొక్క లక్షణాన్ని చెప్తున్నారన్నమాట. చూడండి, ఏమున్నాయో జనకమహారాజు గారికి. మహా పండితుడు, విజ్ఞాని, రాజర్షి - అదిట అండి. Already జనక మహారాజుగారు మహా పండితుడు. అంటే శాస్త్రాధ్యయనం అంతాకూడా పూర్తి అయిపోయింది. ఇంకా ఎటువంటి వారు? విజ్ఞాని. కేవలం శాస్త్ర జ్ఞానం వరకూ ఆయన ఆగిపోలేదు. వాటిని నిజజీవితంలో ఆ జ్ఞానాన్ని ఆశ్రయించి అనుసరించి జీవించాడు. తద్వారా ఏమైంది? విజ్ఞాని అయ్యాడు. ఈ విజ్ఞానాన్ని మళ్ళా ఏమి చేశాడు? రాజర్షిగా మళ్ళా ఆ రాజర్షి అంటే ఏమిటికాబట్టి ఆయన కేవలం విజ్ఞానంతో ఆగలేదు. రాజర్షి అనేంత వరకూ వచ్చాడు. రాజర్షి అంటే? ఏమిటి తేడా? రాజర్షి అని, బ్రహ్మర్షి అని పేర్లు పెడుతున్నారు. వశిష్ఠ మహర్షి ఒక్కడే మనకు తెలిసినటువంటి, అందుబాటులో వున్నటువంటి బ్రహ్మర్షి. ఎందుకని అలా చెప్పారు? ప్రతి మహాయుగంలో త్రేతా యుగంలో ఒక వశిష్ఠ మహర్షిగారు ఎప్పుడూ వుంటారు. సప్తమహర్షిలో వశిష్ఠ మహర్షిగారు వున్నారు కదా ! వున్నారా? లేరా? చూడండి. మరి ఆయన ఎప్పుడూ వుంటారు కదా! మరి ఎప్పుడూ వుండే ఆయన ఎలాగ? అంటే ఆ కార్య నిమిత్తం అశరీరులు అయినవారు మళ్ళీ శరీరం ధరించి వస్తారు. వీళ్ళు ఎప్పుడూ అశరీరులే. అట్టి అశరీర స్థితి నుంచి మళ్ళా కార్యక్రమం అవసరమైనప్పుడు కాసేపు సశరీరులుగా వస్తారు. 

            దీంట్లో కూడా శంకర భగవత్పాదులు గురువుగారి దగ్గరకు వెళ్ళారు. ఎక్కడికి బదరికావనం అంటే బ్రహ్మకపాలం బద్రీనాథ్‌. వెళ్ళి గుహ ముందు నిలబడి ప్రార్థించారు. గురువుగారు లోపల గోవిందపాదాచార్యులు ప్రకాశ రూపంలో వున్నారు. ఇప్పుడు సశరీరులా? అశరీరులా? ఆ గుహలో ఏమీ విలువ లేదండి. మామూలుగా ఏం వెలుగు లేదు. కానీ గుహ అంతా కాంతి వంతంగా వుంది. ఇప్పుడు గురువుగారు ఎలా వున్నారు అక్కడ. ప్రకాశ రూపంగా వున్నారు. సశరీరంగా వారికి దర్శనం ఇచ్చారు. ఇచ్చి బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాశారు.  అక్కడే వుండి వారు బ్రహ్మసూత్రాలకి భాష్యం వ్రాశారు. కాబట్టి భారతదేశం గొప్పతనం ఏమిటంటే ఇక్కడే తెలిసేది. అనేక మంది మహానుభావులు అశరీర పద్ధతిగా భారతదేశంలో వున్నారు. ఇక్కడా అక్కడా అని చెప్పడానికి ఏమీ లేదు. చాలా మంది హిమాలయాల్లో వున్నారు. వారు దేశంలో అన్ని చోట్లా వున్నారు. మన పక్కన కూడా అశరీరంగా చాలా మంది వున్నారు. మరిప్పుడు ఈ మహానుభావులందరూ నడిచినటువంటి భూమి కాబట్టి భారతదేశంలో (పుట్టడం) జన్మించడమే మహద్భాగ్యం.  అర్థమైందా అండీ! అయితే ఈ సత్యాన్ని మనం నిత్య జీవితంలో మరచిపోయాం. వారితో మనకు పనిలేకుండా, మన శరీరాన్ని సరిగ్గా చూసుకోవడంతోనే జీవితం ముగిసి పోతుంది. ఎంతసేపూ ఈ జానా బెత్తెడు శరీరం సుఖంగా వుందా లేదా? అని చూసుకోవడంతోనే సరిపోతుంది.

            కాబట్టి ఆయన రాజర్షి అని ఎందుకు చెప్పారయ్యా అని అంటే, మరి రాజ్య కార్యకలాపాలలో మునిగి వున్నప్పటికీ కూడా ఆయనకు ఏం చెడిపోలేదటా? ఋషిత్వం. నాన్‌ ఋషిః కురుతే కావ్యం. ఏదైనా ఒక కావ్యం రచించాలి అనంటే ఋషిత్వం వుండాలంట. అంటే ఆ తపఃశక్తి వుండాలి. ఆ ధీ శక్తి వుండాలి. ఆ విజ్ఞానం, అనంత సృష్టి్కి సంబంధించినటువంటి విజ్ఞానం అంతా కూడా అతనిలో వున్నప్పటికీ, అతని దైనందిన దినచర్యలో ఎక్కడా కూడా, అతను చేసే కర్తవ్యం చేత అతను ప్రభావితం కాకుండా ఎవరైతే వున్నారో అతడు రాజర్షి అని అర్థం అన్నమాట. అలాగే కర్త లేకుండా వుండేటటువంటి స్థితిలో వున్నవారికి కూడా సందేహాలు అడుగుతున్నారు. చూడండి. ఆయన ఎటువంటి వాడట? చేసే పని యొక్క ప్రభావం ఆయన మీద లేదు. కారణం ఏమిటట? నేను చేయడం లేదు. ఆయన సిద్ధాంతం ఏమిటి? రాజుగా పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా కార్యభారం అంతా నిర్వహిస్తున్నప్పటికీ కూడా అందులో ఎక్కడా కూడా నేను చేయడం లేదు. ఎవరు చేస్తున్నారు మరి? ఇదంతా సృష్టిలో భాగం. పరమాత్మలో భాగం. కాబట్టి చేస్తే ఎవరు చేయాలి? ఆయనే చేయాలి. అంతే కదా! మధ్యలో నేను ఎవరిని? నేనేమి ప్రత్యేకంగా చేస్తున్నది ఏమీ లేదు. నేను ప్రత్యేకంగా లేను. నాకు ఉనికి ఎక్కడ వున్నది? పరమాత్మకి వరప్రసాదంగా నాకు ఉనికి లేదు. అంటే ఆయన ఎందులో ఇచ్చాడు నాకు ఉనికి? ఆయన యందే నాకు ఉనికి వున్నది. ఎందుకని? సర్వులకు ఉనికి ఆయనే అయివున్నాడు. నేను వున్నాను అనేటటువంటి ఆ వునికి ఎందులో భాగం అయివున్నది? పరమాత్మ యందే భాగం అయివున్నది. కాబట్టి పరమాత్మకు ఆ ఉనికి ఇవ్వగలిగిన శక్తి వున్నది కాబట్టే ఈ సృష్టి అంతా నిలబడుతుంది. పరమాత్మ ఈ సృష్టికి ఒకటే శక్తిని ఇచ్చాడు. ఏమిటట? ఉండడం అనేటటువంటి శక్తి. మరి అట్టి పరమాత్మ తయారు చేసినటువంటి ఈ అనంత సృష్టి కూడా, పరమాత్మ లక్షణంతోనే నాకు కనపడుతుంది. నాకు ఏం కనపడుతోందండి? పరమాత్మ లక్షణంతోనే కనపడుతుంది. కాబట్టి నేను చేస్తున్నది ఏమీ లేదు. నేనేమీ చేయడం లేదు. అనేటటువంటి అతడు అకర్త. అకర్తృత్వభావంతో చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే కర్తవ్యం ప్రభావం అతని మీద లేదన్నమాట. వాళ్ళందరినీ ఏమన్నారండీ? రాజర్షులు.

            అలాంటి ఆయన రెండు మూడు ప్రశ్నలు వేశాడు ఇప్పుడు అక్కడ. ఏమి వేశాడు? అక్కడ ఏదో రెండు ప్రశ్నలు వేశాడు చూడండి. “తన సందేహాలను, సమస్యలను ఆత్మ నిష్ఠుడైన అష్టావక్ర మునీంద్రుని ముందుంచి తీర్చవలసినదిగా ప్రార్థిస్తున్నాడు. భగవంతుడన్నా, సత్యమన్నా, ఆత్మ అన్నా ఏ పేరుతో పిలిచినా వున్నది ఒకే ఒక సత్యం. అదే ఇంద్రజాల సమానమైన తన మాయాకల్పిత జ్ఞానంలో, తానే చిక్కుకున్నట్లు దేహ మనో బుద్ధులతో కూడిన జీవిగా, తాను చూస్తున్నాను అనుకునే ప్రపంచంలో వ్యవహరిస్తున్నట్లుగా మనస్సుతో భావిస్తున్నది, తనతో అసంఖ్యాకమైన రాగద్వేషాలను, నిశ్చయనిశ్చయాలను, ఆశానిరాశలను అనుభవిస్తూ తనదైన ప్రపంచంలో మానసిక అనుభవం పొందుతూ వున్నట్లుగా జీవుడు భావిస్తున్నాడు. ఈ కర్తృత్వ భావన కారణంగా తత్ఫలితమైన జన్మకర్మ చక్రంలో భ్రమిస్తున్నట్లుగా భ్రమపడుతున్నాడు. ఈ బాధలలో వుండిపోకుండా బయటపడడానికి తనకు, జగత్తుకు సృష్టి కర్త అయిన జగదీశ్వరుడిని ప్రార్థించాలనే కోరికతో ఏకాగ్రత పెరుగుతున్నది. ఈ ఏకాగ్రత, ఈ భావనాబలం తన పరిస్థితులను అనుకూలంగా మార్చి, సరైన మార్గాన్ని చూపి సత్యమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఏ బుద్ధితో తానుగా, జగత్తుగా, జగదీశ్వరుడిగా భావిస్తూ, భ్రమపడుతూ భ్రమిస్తున్నాడో అదే బుద్ధితో ఉన్నది ఒకే ఒక సత్యమని, అదే తానని, కనిపిస్తున్నటువంటిది అంతా భ్రమయని తెలుసుకోవడంతో భ్రమాజన్య భావనా చక్రంలో భ్రమణం సమాప్తమౌతున్నది. అజ్ఞానం నశించి, జ్ఞానం మిగిలిపోతున్నది. తిమిరం పోయింది. తేజస్సు మిగిలింది. జ్ఞానజ్యోతి నిశ్చలంగా, ఏకంగా, అద్వితీయంగా, తానుగా ప్రకాశిస్తున్నది నిత్యంగా”.

            ఏమన్నాడు? ఎలా చెప్పాడు? వివేకచూడామణి సారాంశం అంతా రెండు లైన్లలో చెప్పేశారా? అక్కడ 500 పేజీలలో చెప్పినటువంటి వివేకచూడమణిని, జనకమహారాజు, ఇదంతా ఎవరు చెప్తు్న్నారు ఇది? జనకమహారాజుగారు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మనస్సు, బుద్ధి అల్లినటువంటి తనకు తానే సాలెగూడు ఎట్లా అయితే అల్లిందో, అట్లా మనోబుద్ధులచేత కల్పించబడినటువంటి, ఎవరయ్యా? జీవుడు. ఈ మనస్సు బుద్ధి వల్లనే నువ్వు జీవుడవయినావు. ఈ జీవుడవు అవడానికి నీకు ప్రధానమైన సమస్య ఏమిటట? నేను పుట్టాను అనే బలమైనటువంటి జ్ఞానం నీలో వుందా లేదా ఇప్పుడు? మీరు పుట్టారా? పుట్టలేదా? పుట్టాను. పెరిగారా? పెరగలేదా? పెరిగాము. మళ్ళా నశిస్తారా? నశించరా? నశిస్తాము. ఈ భ్రమాకల్పిత జ్ఞానం అన్నమాట ఇది. నేను పుట్టాను, నేను పెరిగాను, నేను పోతాను అనేటటువంటిది ఏదైతే వున్నదో, ఈ జన్మ చక్రం, కర్మ చక్రం ఈ రెండు చక్రాలు కూడా ఎందులో సృజించబడుతున్నాయట? ఈ మనోబుద్ధుల కల్పనలోనే సృజించబడుతున్నాయట.

            అందువల్ల ఏమైపోయావు? నీవు వేరే, నీవు చూస్తున్నటువంటి జగత్తు వేరే. ఈ జగత్తుకు ఈశ్వరుడు కూడా వున్నాడు. ఇంకొకడిని కూడా పెట్టాడు. ఏమైందండీ? ముగ్గురు అయ్యారు. ఉన్న ఒకే ఒక్కడు జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. జగత్‌ జీవేశ్వర భ్రాంతి కలిగింది. ఇందులో మొదటి భ్రాంతి ఏమిటి అసలు? అంటే, ఈశ్వరుడికంటే తాను వేరని, ఈశ్వరుడికంటే జీవుడు వేరేనని తలంపు కలగటమే మొదటి భ్రాంతి. ఆ భ్రాంతి దృష్టితో సృష్టిని చూచాడు. అప్పడు ఏమయ్యింది? అది ఇంకో ముక్క అయిపోయింది. అర్థమైందా అండి? కాబట్టి ఈశ్వరుడి కంటే తాను వేరు అనేటటువంటి భ్రాంతిని కనుక తెగ్గొట్టినట్లయితే ఏమైంది? ఈ జగత్తు, ఆ జీవుడు ఈ రెండూ ఎగిరిపోయినాయి ఒకేసారి. ఎగిరిపోయి ఏమి మిగిలిపోయింది? ఈశ్వరుడు మిగిలిపోయాడు. కాబట్టి నీవు నిత్యం జీవించేటప్పుడు, ఈ జగత్‌ జీవేశ్వర భ్రాంతిలో, ఏ భ్రాంతి దృష్టినుంచి మనం చూస్తున్నాము? మనం ప్రతి నిర్ణయము, ప్రతి ఆలోచన చేసేటప్పుడు, జగత్‌ దృష్ట్యా చూస్తున్నామా? ఈశ్వర దృష్టితో చూస్తున్నామా? జీవుడి దృష్టితో చూస్తున్నామా? ఈ మూడు దృష్టులు మనలో వున్నాయా? లేవా? ఈశ్వర దృష్టితో నిర్ణయం చేశామండి. అప్పుడు ఏదన్నా ఒక్కటి చెప్పండి చూద్దాం, అలా ప్రస్తుతం చేస్తున్నటువంటి, కర్తృత్వభావంతో చేస్తున్నటువంటివి ఏదైతే వున్నాయో, వీటిలో ఈ మూడు వున్నాయా లేవా? వున్నాయి కదా!

            ఉదాహరణ చూద్దాము. వినాయక చవితి చేయాలా వద్దా? చెయ్యాలి. చెయ్యాలా అండీ? ఎందుకు చేయాలి? చేయకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటట? ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? అనుకోలేదుగా. పెద్దవాళ్ళు చేయమన్నారు, చేశారు అంతే. ప్రశ్నించుకునే విధానం మన దగ్గర లేదు. ఎందుకు చేయాలి అసలు? అని ప్రశ్నిస్తే నీకు స్థిరత్వం వచ్చిందా? ఏ స్థిరత్వం లేకుండా గుడ్డిగా చేసుకుంటూపోతే వచ్చిందా? ఇంతకాలం ఎన్ని వినాయక చవితిలు చేసి వుంటారు? లెక్కలేదుగా. మొన్న ఈ మధ్యే మీరంతా కూడా చేసినది ఏమిటి? వరలక్ష్మీ వ్రతం కూడా చేసేసి వుంటారు. ఎందుకు? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మొదలయినాయి? జీవేశ్వర భేదం చేత. ఈశ్వరుడు వేరే, జీవుడు వేరే అనే భావం చేత, ఈశ్వర స్థితిని నేను పొందాలి అంతేనా? కాదా? మరి ఆ సగుణ భక్తితోటి, ఈ ఈశ్వర ఆరాధన అనే ఒకే ఒక్క సూత్రం వుందన్నమాట. అంతేనా కాదా? నీవే ఈశ్వరుడవు అని తెలుసుకోవడమనే ప్రధాన లక్ష్యంతో చేస్తే ఇన్ని సార్లు చేయవలసిన పని వుందా? ఈ పద్ధతిగా చేయవలసిన పని వుందా? ఇప్పుడు ఏ పద్ధతిలో చేస్తున్నాము? జగత్తు దృష్ట్యా, జీవుడి దృష్ట్యా, భ్రాంతిగత దృష్టితో బాలుడిగా వున్నప్పుడు, నువ్వు అవగాహన చేసుకోలేక పోయినప్పుడు నువ్వు ఎలా వున్నావో, నిన్ను నువ్వు అర్థం చేసుకునేంత తెలివి అప్పుడు లేదు నీకు. కాబట్టి నీకు బాల్యంలో నీ పెద్దవాళ్ళు ఇలా చెప్పారు. దీన్ని అర్థం చేసుకోవడం కోసం చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం చెప్పారు. కానీ నువ్వు వృద్ధాప్యం వచ్చినా కూడా ఎలా చేస్తున్నావు? కాబట్టి ఇప్పుడు చేయవలసిన పద్ధతి వేరుగా వుంది. ఎలా వుందట? నేను ఈశ్వరుడిని అనే స్థితిలో వుండాలి నువ్వు. జీవుడు, జగత్తు తొలగిపోయి నేను ఈశ్వరుడను అనే స్థితిలో నిలచివుంటే, అప్పుడు నిన్ను ఏమి విడిచిపెట్టింది? అంటే, కర్తృత్వం నిన్ను విడిచి పెట్టింది. నీవు ఈశ్వరుడిగా వుండనంత వరకూ, నిన్ను నీ కర్తృత్వం విడిచిపెట్టదు. కర్తృత్వం అనే భావన నీకు వున్నంత వరకూ నీవు పుట్టక తప్పుదు. జనన మరణ చక్రాలలో చిక్కుకొనక తప్పదు. అర్థమైందా? అని స్పష్టంగా చెబుతున్నాడు. చూడండి అక్కడ చెబుతున్నాడా లేదా? కర్తృత్వ భావం చేత, జనన మరణ చక్రంలో చిక్కుకున్నావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలట? ఈశ్వరుడికి జననమరణాలు వున్నాయా? ఎందుకని లేవు? దేనికీ కర్త కాదు కాబట్టి. నేనుని అనుభవించడం లేదు కాబట్టి. అవునా కాదా? అని ఎలా నిర్ణయం చేశావు మరి? ఎలా తెలుసు నీకు? అంటే దేవాలయాల్లో ఒక విగ్రహం పెట్టావండి. ఆ విగ్రహం దేనికైనా బాధ్యత వహిస్తుందా? ఏమన్నా స్వీకరించిందా? పోనీ ఏమన్నా నిరాకరించిందా? స్వీకరించనూ లేదు, నిరాకరించనూ లేదు. కాబట్టి అటువంటి సాక్షిత్వభావం, అచల భావంతో కదలనటువంటి పద్ధతిలో ఒక విధానాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అయితే దాని నుంచి ఏ లక్షణాన్ని నిశ్చల మనోబుద్ధులు కలిగి వుండాలో, సాంతం కలిగివుండాలో జీవేశ్వర ఐక్య ప్రతిపాదనలో జీవుడు, ఈశ్వరుడు ఇద్దరూ వుండాలా వద్దా? కానీ వున్నదే ఈశ్వరుడు అయినప్పుడు ఐక్యం చెందేవారు ఎవరు? వున్నాయా అసలు? లేవు అని అంటున్నావు. కానీ ఆచరించేటప్పుడు మాత్రం...లేదు. సిద్ధాంతంగా ఒప్పుకున్నాం కానీ, ఆచరణలో అలా లేము. అలా లేకపోవడము చేత, వివేక శూన్యత ఏర్పడి, నీవు ఈశ్వరుడికంటే భిన్నం అనే భావన చేత జగత్‌ భ్రమలో పడిపోతున్నావు. కాబట్టి జగత్‌ భ్రమ పోవాలి అంటే, నీవు జగత్తు వైపు వెళితే అది పోదు. ఏం చేయాలి? ఈశ్వర లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, ఈశ్వర లక్షణాలతో జీవిస్తూ, వివేకం కలిగి వున్నట్లయితే, ఆ జీవితానుభవం ద్వారా నేను ఈశ్వరుడిని అనే నిర్ణయం స్థిరపడుతుంది. ఆ లక్షణాలతో జీవించే కొద్దీ, నేను ఈశ్వరుడని అనే భావం స్థిరపడి, అప్పుడు ఏమైంది? భావ ప్రభావం చేత ఏర్పడినటువంటి, ఈ జగత్‌ భ్రమ, ఆ జీవుడు ఇద్దరూ ఒకే సారి తొలగిపోతున్నారు. ఒకేసారి తొలగిపోవాలట. అంటే అర్థం ఏమిటి? జీవుడు వుండి, జగత్‌ భ్రాంతి తొలగిపోవాలంటే సాధ్యం కాదు. జీవుడు వున్నంత కాలం, జగత్‌ భ్రాంతి వుండక తప్పదు. కాబట్టి ఏం చేయాలట? ఈ రెండూ ఒకేసారి లేకుండా చేయాలి. మనం ఇప్పటి వరకూ ఆరాధన చేసేటప్పుడు అలాంటి పద్ధతిలో చేశామా? చేయడం లేదుగా. నువ్వు జీవుడిగానే వుంటున్నావు, ఆ జగత్తులో దొరికేటటువంటి ఉత్తమమైనటువంటి వస్తువులన్నీ ఈశ్వరారాధనకు వినియోగించాను అంటున్నావు. ఇప్పుడు ఈ వస్తువులలో ఏం గమనించావు? ఈశ్వరుడినే గమనించావా? గమనించలేదు. వస్తువులను వస్తువులుగానే చూశావు. భోగ్య వస్తువుగా చూశావు. వీటిని పైగా ఎలా చూశావు? జీవుడికి ఈ ప్రపంచం అంతా ఎలా కనపడిందటా? భోగ్యవస్తువుగా కనపడింది. అంటే అనుభవించడానికి తగిన వస్తువుగా కనపడుతోంది జీవుడికి. నీకు ఏమి అధికారం వుంది? వుందా? నీవు సృష్టించావా? నీవు పోషించావా? నీవు దేనికైనా కారణమా? కాదుకదా! ఈశ్వరుడు కారణంగా అనంత సృష్టి సృజించబడింది. ఆయన కర్తగా ఈ కార్యం, ఈ సృష్టికార్యం నిర్వహించబడుతోంది. మధ్యలో నీకు ఏం అధికారం వుందని, ఈ కాస్తా ఈ 1000 గజాలు నాది, 200 గజాలు నాది, 6 గజాలు నాది చివరికి స్మశానంలో స్థలం కూడా మనం reservation అన్నమాట. ముందే reservation చేసుకోకపోతే స్మశానంలో స్థలం కూడా లేదు. మరి ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చేశాము? అంటే జగత్‌ భ్రాంతి, ఇలా రావడానికి కారణం ఏమిటి? అంటే, జగత్‌ భ్రాంతి. ఈ ఆరు జతలు నావి, అది అనంత సృష్టిలో భాగం కాదా?

            యశోదమ్మకి గోపికలు complaint ఏమని చేశారు? విజ్ఞాపన చేశారు. ఏంటంటే? మీ పిల్లవాడు మా ఇళ్ళకు వచ్చి, ఆవుల యొక్క దూడలని, మేము పాలు పిండుకోక ముందే వదిలిపెట్టేస్తున్నాడు. దాని వల్ల మా ఇంట్లో పిల్లలకు పాలు వుండటం లేదు. మా కోడలు గారికి ఆరోగ్యం సరిగా లేకపోవడం చేత, ఆమెకు పుట్టినటువంటి మా మనవడికి పాలు ఆవిడ ఇవ్వలేని పరిస్థితిలో వున్నందువల్ల, ఈ ఆవుపాలు పడుతున్నాం. మీ పిల్లవాడు వచ్చి ఆ దూడను విడిచిపెట్టడం వల్ల పాలు లేకుండా పోయినాయి. కాబట్టి మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మీ పిల్లవాడు ఇబ్బంది పెడుతున్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? ఆవు యొక్క స్థన్యం మొదటి అధికారం ఎవరికి? (దూడకి) నువ్వు ఏం చేస్తున్నావు? అది కనపడేట్టుగా కట్టేస్తావు. అర్థమైందా అండీ? ఆ తల్లికి ఈ బిడ్డ కనపడేటట్టుగా కట్టేశావు. తెలివైన వాడన్నమాట. కట్టేసి ఆ తల్లి ఆ పిల్లవాడిని పోషించాలనే దృష్టి వల్ల అది పాలు ఇస్తుంది. ఆ బిడ్డను తీసేయి. ఇంక అది పాలు ఇవ్వదు. ఇప్పుడు మనం వేరే వేరేగా అనుకున్నాం. ఎలాగైనా సరే మనకు పాలు తీసుకోవడం అలవాటు అయిపోయింది. మిషన్‌లు పెట్టి కాని ఎలాగైనా తీసుకోవచ్చు. ఆ రకమైనటు వంటి ప్రేరణ వచ్చేటటువంటి ఇంజెక్షన్లు ఇచ్చి కూడా మనం పాలు తీస్తున్నాము. అంటే మానవుడు ఎట్లా అయితే క్రమేణా దిగజారిపోతున్నాడో తెలుసుకోవడం కోసం చెబుతున్నారు. ఆ నాటి యుగంలో, ఆ కాలంలో కృష్ణుడు చేసింది సబబే. ఈ నాటి కాలంలో మనం ఏం చేస్తున్నాము? ఇప్పడు దూడలతో మనకు పనిలేదు. దూడలు అసలు మొదటి సంవత్సరం లోపలే చనిపోతున్నాయి. ఎప్పటికప్పుడు ఏవి అవసరమో వాటిని మాత్రమే వుంచడం, మిగిలినవాటిని విసర్జించడం. అంటే పూర్తి వ్యాపారాత్మకంగా మారిపోయింది. మరిప్పుడు మనల్ని ఏమి అర్థం చేసుకోమంటున్నారు? అసలు సృష్టిలోనే నీకు ఏమీ భాగం లేదయ్యా. ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు. 

            నువ్వు సృష్టిలో ఒకానొక అంశవి. ఆ పరమాత్మలో ఒకానొక అంశవి. అయితే పరమాత్మలో అంశగా వుండడం, లేకపోతే పరమాత్మలోనే లేకుండా పోవడం. నువ్వు లేకుండా పోయినా ఎక్కడ లేకుండా పోయావు? అట్టి పరమాత్మయందే లేకుండా పోయావు మళ్ళా. ఒక వేళ వున్నాను అన్నావనుకో, ఎక్కడున్నావు? ఆ పరమాత్మయందే వున్నావు. లేకుండా - అందులో కూడా చూడండి. లేక + ఉండడం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండీ? లేనే లేడు. లేకుండా పోయాడు. లేక వుండా పోయాడు. ఇక్కడ కూడా చెబుతున్నావు. అంటే ఎప్పుడూ వుండేవాడు ఒకడు వున్నాడు. వాడిలోనే కాసేపు వుండడం, కాసేపు లేకపోవడం అనే రెండూ కూడా జరుగుతూ వున్నాయి. అర్థమైందా? ఇప్పడు వుండే పరమేశ్వరుడు ఎప్పుడూ వున్నాడు. వాడిలో ఏమి జరుగుతుందట? కాసేపు జగత్తు వచ్చింది, కొంతకాలం వుంది, తర్వాత లేదు. ఆ జగత్తులో భాగంగా జీవరాశులు అన్నీ వచ్చినాయి. ఇవికూడా కొంతకాలం వున్నాయి. తరువాత కొంతకాలం లేవు. మరలా కొంతకాలం తరువాత మళ్ళా ఉత్పన్నం అవుతాయి. కాల ప్రభావం చేత, ఉత్పన్నం అయ్యింది ఈ సృష్టి. మరల అదే కాలంలో కొంత కాలం అయ్యేటప్పటికి లేకుండా పోయింది. మరి ఎప్పుడూ వుండే వాడు వున్నాడా లేడా? వాడు ఎప్పుడూ వున్నాడు. వాడికి ఏ భేదమైనా వుందా? ఏ మార్పు అయినా వుందా? (లేదు). మరి నీవిప్పుడు ఎవరిమీద అయితే ఆధారపడి సృష్టించబడుతున్నావో, ఎవరిమీద ఆధారపడి నీ పరిణామం అంతా జరుగుతూ వుందో, ఎవరిలో నీవు లయించి పోతున్నావో, అట్టి సర్వాధారుడిని తెలుసుకునే ప్రయత్నం, సర్వాధారుడి యొక్క లక్షణాలే నీకు వున్నాయా? లేవా? అని విచారణ చేసుకోవాల్సిన అగత్యం వుందా లేదా? వుంది కదా! మరి మనం జీవితంలో ఇప్పటి వరకూ ఒక యాభై ఏళ్ళు, అరవై ఏళ్ళు గతించిందా? గతించలేదాఇప్పుడు ఏ స్థితికి వచ్చాం? కాళ్ళు, చేతులు, వెన్ను నిలపలేని స్థితికి వచ్చాము. వచ్చామా లేదా? ఈ పద్ధతిని ఎప్పుడైనా గుర్తించామా? గుర్తించక పోవడం వల్ల ఏమైంది నష్టం? సాలె పురుగు వలె మన చుట్టూ మనమే గూడు అల్లుకుని ఆ గూడు లోనే ఆహారం లభిస్తే తిని, ఆ ఆహారంతో సంతృప్తి చెంది, అక్కడే ఆ గూడు లోనే మరలా శరీరాన్ని విడిచి పెట్టేస్తు్న్నాము. కాబట్టి ఇలాంటి మనో బుద్ధులచేత కల్పించబడినటువంటి జగత్ జీవేశ్వర భ్రాంతి అనేటటువంటి దాంట్లో చిక్కుకోవద్దు. ఇవి రెండూ నీ మనో బుద్ధుల యొక్క కల్పితాలు. యథార్థ దృష్టితో చూస్తే, ఎప్పుడూ వున్నవాడు ఎప్పుడూ వున్నాడు. మధ్యలో వచ్చిపోయేవి, వస్తున్నది, పోతున్నది. అర్థమైందా అండీ?

            అచల సిద్ధాంతం కూడా ఇదేగా చెబుతున్నది, ఎప్పుడూ వున్నది చట్టువలె అలాగే కదలక వున్నది. మధ్యలో వచ్చిపోయే ఎఱుక కొంత కాలం వున్నది, తరువాత కొంతకాలం తర్వాత లేకుండా పోయింది. ఈ అనంత విశ్వమూ కూడా అదే. అందులో భాగమే నువ్వు కూడా. మరి ఇప్పుడు మనం కాదనగలమా? కాదనలేకపోతున్నాం కదా! ఈ భూమండలం మీద నువ్వు ఒక్కడివేనా నవుడివి? ఇలాంటి భూమండలాలు అనంత సృష్టిలో ఎన్ని వున్నాయి? నీకు నాకు లెక్క తెలియదు. తెలియదు కాబట్టి లేదు అనవచ్చాఅనలేవుగా. ఈశ్వరుడు ఒక్కడే సూర్యుడా? అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఏమన్నారు? అన్ని నక్షత్రాలు సూర్యుడులే. మరి అన్ని నక్షత్రాలు సూర్యుడులే అయినప్పుడు మన కళ్ళకు కనబడుతున్న నక్షత్రాలే ఎన్ని వున్నాయి? లెక్కపెట్ట లేని అన్ని వున్నాయి. మరి ఇన్న లెక్కపెట్టలేనన్నవాటికి సౌర కుటుంబాలు వున్నాయా? లేవా? నీకు ఎలా తెలుసు? ఎందుకనిట? ఈ భూమండలం మీద వున్నటువంటి దాంట్లోనే, నీకు పరిమితమైన జ్ఞానం వుంది. అంతేనా కాదా? 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద వుంటే, భూమండలం మీద మనకు ఎన్ని జీవరాశులు తెలుసు? మనం తెలుసుకునే ప్రయత్నం చేశామా? లేదుగా. గుప్పెడు మానవులు చాలండీ, మన తగాదాలకీనూ మన సుఖాలకి. అంతేనా కాదా? ఒక పది మంది తెలుసేమో మహా అయితే జీవితం మొత్తం మీద. ఆ 10 మందితో మన జీవితం ముగిసిపోతుంది. మరిప్పుడు మనకి ఏం బాగా తెలుసు? ఇప్పుడు మనం ఎవరితో పోటీ పడుతున్నాము? సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వ కర్త, సర్వ భోక్త, సర్వ హర్త, ఏ కాలంలోనూ చలించనటువంటి వాడు, ఎల్లప్పుడూ వున్నటువంటి వాడు, అట్టి ఈశ్వరునితో మన పోటీ అన్నమాట. ఇప్పుడు మనమేమి అంటున్నాము? ఈశ్వరుడు లేడు అని చెప్పగలవా ఎవరన్నా? ఎలా? అక్కడిదాకా వచ్చేశామన్నమాట మనం. ఎందుకని? వుంటే నాకు ఏమిటండీ ప్రయోజనం? అంటే ప్రయోజనం దృష్ట్యా నిర్ణయించేటటువంటి పద్ధతిలోకి మనం మారిపోయాము. కర్తృత్వము, భోక్తృత్వము వలన ఏమి జరిగినది అంటే, ప్రయోజనము దృష్ట్యా నిర్ణయించడము.

            ఇల్లు వుందా లేదా? వుంది. ఎలా చెప్తున్నావు? దాని వల్ల నాకు ప్రయోజనము వుందికాబట్టి. ప్రయోజనము లేకపోతే నాకెందుకు దాని సంగతి? అంటున్నావా లేదా? కాబట్టి జగత్‌ భ్రాంతి అంటే ఏమిటయ్యా? అంటే, ఫలితము దృష్ట్యా నిర్ణయించడమే జగత్‌ భ్రాంతి. జగత్‌ భ్రాంతి అంటే ఏమిటి? ఫలితము దృష్ట్యా నిర్ణయించడమే జగత్‌ భ్రాంతి. ఫలితము అంటే ఇప్పుడు ఎక్కడ వుంది? కారణ స్థితిలో వుందా? లేదు. కార్య స్థితిలో కూడా చిట్టచివరి భాగం. కాబట్టి జనన మరణాలచేత నీవు బాధించబడుతున్నావు. ఈ ఫలితం దృష్ట్యా నిర్ణయించేటటువంటి లక్షణం నీలో వున్నంత వరకూ, నీవు జనన మరణాల చేత బాధించబడక తప్పదు. ఈ జగత్‌ భ్రాంతి విడవాలి అనంటే, జీవజగత్తులు రెండూ విడిచిపెట్టినప్పుడు మాత్రమే సాధ్యమౌతుంది. కాబట్టి వీటి మూలమైనటువంటి ఈశ్వరుడిని ఆశ్రయించి, నేను ఈశ్వరుడిని అనే భావంలో కనుక నీవు వుండినట్లయితే, ఏమైందంటే నీ జీవజగత్‌ భ్రాంతులు రెండూ ఒకేసారి విడిచిపెట్టేశాయి. అప్పుడు ఈశ్వర కార్యంలో కారణం ఎవరు? ఈశ్వరుడు. ఈ సృష్టికి కారణంగా ఈశ్వరుడు వున్నాడు. ఈ సృష్టి అంతా కార్యంగా కనుక భావించినట్లయితే, ఈ కార్యం మొత్తము కారణం మీద ఆధారపడి వున్నది కాబట్టి, ఆ కారణమే నేనుగా నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుని జీవిస్తావో, అప్పుడు నీలో ఆ ఈశ్వర లక్షణాలే నిలబడి వుంటాయి. జగత్తుకు సంబంధించిన లక్షణాలు కానీ, జీవుడికి సంబంధించిన లక్షణాలు కానీ లేకుండా పోయినాయి. అని వివేకచూడామణి నిర్ణయం చేసింది. అంతేనా కాదా?

            ఈ వివేకచూడామణి చిట్టచివరి భాగం చూడండి. ఆ క్రింద అవి చదవండి. “నానాత్వ నిషేధము, ఆత్మానుభవ ఉపదేశము, శిష్యుని బోధనానుభవము, ఉపదేశము యొక్క ఉపసంహారము, అధిష్టాన నిరూపణము” ఈ సృష్టికి అధిష్టానము ఎవరు? ఈశ్వరుడు. ఆ నిరూపణము. “సమాధి నిరూపణము” - అది. నీవు ఈశ్వరుడవు అని భావించినప్పుడు ఏ స్థితిలో వున్నావు? నాకు ఈశ్వుడికి భేదం లేదండి. ఈశ్వరుడు అధిష్టానముగా ఈ సృష్టి వున్నదండి. మట్టితో తయారు చేయబడినటువంటి ఏ పాత్ర అయినా సరే, దాంట్లో ఏ లక్షణం వుండాలి? మట్టి లక్షణమే వుండాలి. ఈశ్వర నిర్మితమైనటువంటి సృష్టి అంతా ఏ లక్షణంతో వుంది? ఈశ్వర లక్షణంతో వున్నది. కాబట్టి నేను ఎవరను? నేను ఈశ్వరుడును. అది అధిష్టాన నిర్ణయములో నిలబడి వున్నావనుకోండి, అప్పుడు ఏమైంది? అదేనయ్యా సమాధిఅంటే. (కర్త, భోక్త లేడు) అదే సమాధి సమ+ధీ అంటే. కర్త చేత కాని, భోక్త చేత కాని ప్రభావితం కానటువంటి స్థితిలో వుండడమే సమాధి. సాధరణంగా మనకు సమాధి అంటే ఏమని బాగా తెలుసు? చనిపోయినాక భూగర్భంలో పాతి పెట్టడం కానీ, అర్థమైందా అండీ? లేదంటే జీవ చైతన్యం కలిగివుండి, నీవు ఒక విగ్రహము వలె కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోవడం గాని. అర్థమైందా అండీ! కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ అలా కూర్చొని వున్నటువంటి విగ్రహమే సమాధి అంటే మనకి సాధనలో తెలుస్తుంది. కానీ ఇక్కడ వివేకచూడామణిలో ఏమి నిర్ణయం చెప్పారు? నీవు ఈశ్వరుడు అనే స్థితిలో వుండడమే. ఆ ఉండడం అనేది ఎలా వుండాలట? ఈశ్వరుడిగా వుండాలట. నీవు ఈశ్వరుడిగా సర్వకాల, సర్వావస్థలలోనూ ఉన్నట్లయితే అదే సమాధి. అర్థమైందా అండీ!

            “వైరాగ్య నిరూపణము” అది. ఇప్పుడు ఎవరికి నిరూపణ? ఇప్పుడు వైరాగ్యం ఎవరిని చూసి నేర్చుకోవలట? ఎవడైతే సర్వకాల, సర్వావస్థలలో ఈశ్వరుడిగా వున్నాడో, వాడి జీవితం అంతా ఏమి పరుచుకుని వుంటుందట? వైరాగ్యమే వుంటుంది. అంటే ఏంటట వైరాగ్యమంటే? రాగద్వేషాదుల చేత బాధించబడకుండా వుండడం. అదే వైరాగ్యం. ఔనా కాదా? రాగద్వేషాదుల చేత బాధించబడకుండా వుండడం అంటే? (జీవత్వం లేకుండా వుండడం) శరీరమే నేనుగా వున్నప్పుడు ఈ జగత్తుకు సంబంధించిన వాటిలో కొన్ని వస్తువులను నీవిగా భావించి, ఆ కొన్ని వస్తువులు కనపడక పోతే, అలాగే కొంతకాలనికి నీ శరీరం కూడా లేకుండా పోతుంది కనుక మొదటి రాగద్వేషాలు దేనిమీద వున్నాయి? నీ మీదనే వున్నాయి. నీ శరీరం మీదే వున్నాయి. కొంతకాలం అయితే ఈ శరీరం కనపడదేమో అన్న దుఃఖం చేత ఈ తగాదా అంత. ఇప్పుడు నీ శరీరం కనపడక పోతే వచ్చిన గొప్ప మార్పు ఏమిటి? సృష్టిలో. ఏమన్నా వుందా? కొంతకాలం ఈ శరీరం కనపడిందండి, కొంతకాలం వుందండి, తరువాత కొంతకాలానికి ఈ శరీరం లేకుండా పోయిందండి. ఇప్పుడు వచ్చిన గొప్ప మార్పు ఏమిటట సృష్టిలో? ఏమీ లేదుగా. ఒక కుండ తయారైందండి. కొంతకాలం ఉపయోగించబడిందండి. తర్వాత పగలేశావండి. ఏం తేడా వచ్చింది మట్టిలో. ఏమన్నా తేడా వచ్చిందా మట్టిలో? మరి నీకెందుకు చింత? నేను పోతున్నాను అంటావు ఎందుకని? ప్రతివాడు ఏమంటున్నాడండి? నేను పోతున్నానా? నా ప్రాణం పోతుందా? రెండిటిలో ఏది కరెక్ట్‌? నా ప్రాణం పోతోంది రోయ్‌ అంటున్నావా? నేను పోతున్నాను అంటున్నావా? అక్కడ కూడా కరక్టే చెబుతున్నావు. నువ్వు పోవు ఎప్పటికి. పోతే ఏం పోతుంది. బోడి ప్రాణం వచ్చింది, పోతోంది. కొంత సేపు ఈ ఘటంలో కొట్టుకుందండి. అంతేనా? కొంతకాలం తరువాత ఘటం పగిలింది. ఆ ప్రాణం పోయింది. అంతేకదా ! పోతే ఇప్పుడు ఏమైందట? ఇప్పుడు ఏమన్నా అయ్యిందా? పెనుమార్పు ఏమైనా వచ్చిందా? సృష్టి ఏమన్నా పునః సృష్టి మళ్ళా మహా ప్రళయం ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలేదుగా. ఇప్పుడు నీ దుఃఖం ఏమిటి? ఇప్పుడు నీ దుఃఖం ఎందుకు? చూడండి. ఈ దృష్టితో మనం దుఃఖించే అంశాలను చూడండి ఇప్పుడు. అసలు నిజంగా దుఃఖించవలసిన అంశాలేనా ఇవన్నీ? మా ఆయన లేవంగానే నాకు నమస్కారం పెట్టలేదు. లేదా మా అబ్బాయి వెళ్ళేటప్పుడు నాకు టాటా చెప్పలేదు. మా మనవడు ఆ స్కూల్‌ ఆటో ఎక్కేటప్పుడు బై చెప్పలేదు. ఏమిటి నీ దుఃఖానికి కారణం? అర్థముందా?

            కాసేపు ఒక కుండ తయారైంది, కాసేపు ఉపయోగించ బడింది, కాసేపు పగల వేయబడింది అంతే! అంతేనా? అది కూడా సృష్టి ధర్మం. సృష్టి నియమం ప్రకారం జరిగిపోతూ వున్నది. ఎందుకని? 84 లక్షల జీవరాశుల దేహములు అవే. మరిప్పుడు నీకు ఏమిటి వచ్చింది నష్టం? ఏమి నష్టం రాలేదు. నీకు వున్న తెలివితేటలు మిగిలిన జీవరాశులకు లేవు. ఇది నువ్వు అర్థం చేసుకుని వుండాలి. అర్థం చేసుకున్నావు. నీ శరీరం పోయిందండి. ఇప్పుడు ఏమైంది? ఏమన్నా అయ్యిందా? ప్రమాదం ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలేదుగా అనే దృష్టితో నీవు నీ జీవితాన్ని చూడు. ఈ దృష్టితో చూస్తే, శరీరంతో చేసే అన్ని పనులూ ఎలా కనపడ్డాయి? ఏమన్నా ప్రత్యేకత వుందా? ఈ శరీరానికి బాగా భూషణాలు ధరించావండి. ఆ భూషణములు ధరించావు. ఏమిటట ఇప్పుడు అయితే? ఏమన్నా పెరిగిందా విలువ? చూడండి మనవాళ్ళు అంతా కూడాను, చక్కగా పట్టు చీర కట్టుకుని, పైనుంచి క్రిందకు అలంకరించుకుని ఎవరైనా వచ్చారనుకోండి ఏమంటున్నావు? ఓహో ! మహాలక్ష్మిలాగా వుంది. అంటే ఇప్పుడు ఏం చేశావు? అక్కడ కూడా ఏం చేశావు చెప్పు? అంటే నీ ప్రత్యేకత అంతా కూడా, జీవుడికి ఈశ్వర లక్షణాన్ని ఆపాదించడమే నీ ప్రత్యేకత. అంతేనా ఇంకా ఏమన్నా వుందా? ఇప్పుడు నీవు ఎవరిని చూస్తున్నావు? ఆ శరీరాన్ని చూడడం లేదు. ఆ ఆభరణాన్ని చూడడం లేదు. అతనిలో ఆ తేజో ప్రభావం. అవన్నీ ధరించడం చేత, ఒక నూతనమైన తేజస్సు వచ్చింది అతనిలో. ఆ తేజో ప్రభావం చేత, ఆ తేజస్సు ఈశ్వర లక్షణం. ఆ తేజస్సుని గుర్తించగానే నువ్వు ఏమన్నావు? ఆహా! భగవంతుడల్లే ఏం వచ్చాడండీ? మరి అప్పుడు ఆయనలో ఆ కాపాడే లక్షణం ఏదైతే వుందో, ఆ దర్శనం ఇచ్చే లక్షణం ఏదైతే వుందో, ఆ తేజస్సు చేత ప్రభావితమై, నీవు ఆ ఈశ్వర లక్షణాన్ని గుర్తించి, అదే ప్రత్యేకంగా చెబుతున్నావు. అంతేనా కాదా

            నీకు ఆపరేషన్‌ చేశారండి డాక్టరు గారు. ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? నిన్ను ఆయుధాలు పెట్టి కోశాడా? కోయలేదా? ఎంత దుఃఖం వచ్చేటట్టే చేశాడండీ? కానీ ఆయనను ఏమంటున్నావు? దేవుడల్లే కాపాడావు అంటున్నావా? లేదా? మరిప్పుడు కాపాడింది ఎవరు? ఆ కాపాడడమనే ఈశ్వర లక్షణం. ఈ సుబ్బారావు గారు కాపాడింది. అర్థమైంది? అతనిలో వున్న ఆ దివ్యత్వం ఏమిటట? రక్షణ బాధ్యత. ఆ కాపాడే లక్షణం వున్నదే అది ఈశ్వర లక్షణం. ఇప్పుడు నీవు సమస్త జీవులలో దేనిని అన్వేషిస్తున్నావు? ఈ ఈశ్వర లక్షణాన్నే. అర్థమైందా అండీ! తల్లిని దైవంగా భావించు. ఎందుకు భావించాలి? ఈశ్వర లక్షణం. నీకు ఆధారం. నీ పోషక కర్త. నీవు ఏమీ చేసుకోలేని కాలంలో నీకు ఆధారంగా వున్నది కాబట్టి. ఆ ఆధారంగా వుండడమేనయ్యా ఈశ్వర లక్షణం. గురువును దైవంగా భావించు. తండ్రిని దైవంగా భావించు. మన భారత దేశంలో దైవం కానిది ఏది? ఒకటి చెప్పండి. చెట్టు, పుట్ట అన్నీ! కానీ పాము కనపడితే ప్రాణం తీస్తారు, పుట్టలోకి వెళ్ళి పాలు పోస్తారు ఎందుకని? అజ్ఞానం. వేరే ఏమీ లేదండి. ఇప్పుడు పుట్టని కొలుస్తున్నావా? పామును కొలుస్తున్నావా? అక్కడ కూడా దేహభ్రాంతే. ఎందుకని? పుట్ట ఇదే కదా! ఇక్కడ ఎట్లా అయితే శరీర భావంతో చూస్తున్నావో, అక్కడ కూడా అదే చూపు. అర్థమైందా అండి? దేవాలయానికి మెట్ల పూజ చేస్తారండి, ఎందుకు? భాగవతోత్తములు నడచిన దారి కాబట్టి, ఆ దారి వెంబడి వారి యొక్క పవిత్ర భావన, ఆ పవిత్రత నీకు అబ్బుతుందని. దృష్టి అంతా దేని మీద పెట్టావు? ఆలోచించండి. నేను గమనిస్తూ వుంటాను, దేని కోసం పెట్టారు? ఏమి చేస్తున్నాం? ఇప్పుడ మెట్ల పూజ చేయమన్నారండి, ఎందుకోసం చేయమన్నారు? ఎందరో మహానుభావులు దైవదర్శనం కోసం వచ్చిన సందర్భాలు అనేకం వుంటాయి కాబట్టి ఆ మహానుభావుడు నడిచినటువంటి ఆ ప్రాంతంలో వారి యొక్క ప్రభావం ఆ సృష్టి మీద, ఆ పంచభూతాల మీద వుంటుంది కాబట్టి, ఆ పవిత్ర భావం నీలో ప్రవేశించి, నీవు ఈశ్వర లక్షణాన్ని పొందే అవకాశం వుంది. అనేదాని కోసం పెట్టమన్నారు. ఇప్పుడు మనమేమి చేశాము? మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అబ్బాయి బాగా చదువుకోవాలి అంటూ పసుపు రాస్తున్నాము. అర్థమైందా అండీ!

            కాబట్టి జగత్తునిండా నిండి వున్నటువంటి ఈశ్వరత్వాన్ని గుర్తించే ప్రయత్నమే నీవు పుట్టింది మొదలు పోయేవరకూ చేస్తున్నటువంటి ఒకే ఒక పని. ఇప్పుడు మనమందరం అనేకమైన పనులు చేశామని అనుకుంటున్నామా? లేదా? అనుకుంటున్నామా లేదా? ఎందుకని? ఎవరైనా పుట్టింది మొదలు ఇప్పటి వరకూ ఏం చేశారండీ? నువ్వు చేసినటువంటి ప్రత్యేకాలన్నీ చెబుతావు. అంటే కాశీ వెళ్ళానండి, రామేశ్వరం వెళ్ళానండి. లేకపోతే ఆ మహానుభావుడి దగ్గరకు వెళ్ళానండి, ఈ మహానుభావుడి దగ్గరకు వెళ్ళానండి. ఇదిగో ఆ పాఠం నేర్చుకున్నాను, ఈ పాఠం నేర్చుకున్నాను. ఇవేనా? మనం చెప్పేది జీవితం మొత్తం మీద? అదీ కాదు. పోనీ ఏం చెప్తావు? ఇదిగో ఆ 66 రకాలు తిన్నానండి. ఈ 26 రకాలు చూశానండి. ఇలా చెప్తావు. ఇంతేనా కాదా? ఈ ప్రత్యేకతలు అన్నీ ఏమిటట? అవి ఈశ్వర విభూతిగా చూసినప్పుడు ఏమైపోయింది? ఈశ్వరుడియందు లయించాయి. ఈ జగత్తుని ఈశ్వర విభూతిగా గనుక నీవు చూచినట్లయితే, అక్కడంతా ఏమి కనపడిందంట ఇప్పుడు? అనేకత్వం కనపడలేదు. ఏకత్వ లక్షణమైనటువంటి ఈశ్వరుడే కనపడ్డాడు. జగత్తు అంతా ఈశ్వరుడే అయినప్పడు నీవు వేరే వుండే అవకాశం వుందా? జీవుడిగా వేరుగా వుండే అవకాశం వుందా నీకు? నీకు ప్రత్యేకమైన ఉనికి వుండే అవకాశం వున్నదా? లేదుగా. ఎందుకని? ఆ జగత్తులో భాగమే కదా! నువ్వు కూడా. కాబట్టి నీవు కూడా ఎవరు? ఈశ్వరుడవే అనే నిర్ణయం చేసుకోమంటున్నారు. అదండి, అధిష్టాన నిర్ణయమంటే. సమాధి అంటే, అర్థమైందా అండి ఇప్పడు? వివేక చూడామణి చివరి భాగాలన్నీ ఇలాంటి నిర్ణయాన్ని చెబుతున్నాయి. అంతేనా కాదా?

            “ధ్యాననిధి, ఆత్మ దృష్టి, ప్రపంచ బాధ, ఆత్మచింతా విధానము, దృశ్యము యొక్క ఉపేక్ష, ఆత్మజ్ఞాన ఫలము, జీవన్ముక్త లక్షణము” ఇలా జీవించేవాడు ఎవరట? జీవన్ముక్తుడు. అంటే జీవించి వుండే, జీవభావం నుంచి ముక్తుడైనవాడు. ముక్తుడు ఇప్పుడు దేంట్లోనుంచి ముక్తుడు అయ్యాడు? జగత్తు, జీవుడు అనే రెండింటి నుంచి ముక్తుడు అయిపోయి ఈశ్వరుడిగా వున్నవాడు. జగత్తుని ఈశ్వరుడిగా చూస్తున్నాడు. తనను తాను కూడా ఈశ్వరునిగానే భావిస్తున్నాడు. వాడు జీవన్ముక్తుడు.

            “ప్రారబ్ధ విచారము, నానాత్వ నిషేధము, ఆత్మానుభవోపదేశము, శిష్యుని బోధానుభవము, ఉపదేశము యొక్క ఉపసంహారము, శిష్యుని సంచారము, శ్రీ గురుదేవుని పరబ్రహ్మ విహారము” ఇలాగ అష్టావక్రగీతకు సంబంధించినటువంటి అంశాలను అన్నింటినీ కూడా, వివేకచూడామణితో బేరీజు వేసుకోవాలి. వేసుకుంటే ఇందులో విస్తారంగా చెప్పబడి వున్నది. ఒక్కొక్క అంశాన్ని విస్తారంగా చెప్పారు. ఇక్కడ ఏం చేశారు వాటిని? సంక్షిప్తీకరించేశారన్నమాట. అర్థమైందా అండీ! కారణం ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము, సదసద్వివేకము, కార్యకారణ వివేకము, దృక్‌ దృశ్య వివేకము నీకు నేను ఈశ్వరుడను అనేటటువంటి ముక్తానుభవం, ఆ మోక్షం ఈ అయిదు పద్ధతులలో వివేకంతో నీకు సాధ్యం అవుతుంది. అని వేదాంతం అంతా కూడా ఈ అయిదు వివేకాలే కనపడుతూ వుంటాయి. ఎక్కడ చూసినా కూడా. ప్రాథమిక స్థితిలో నిత్యానిత్య వస్తు వివేకము. ఎదిగినాక ఆత్మానాత్మ వివేకము, ఆ తరువాత సత్‌ అసత్‌ సదసద్వివేకము, ఆ తరువాత కార్యకారణ వివేకము, ఆ తరువాత దృక్‌ దృశ్య వివేకము. కాబట్టి మీరు దేనినైనా సరే ఈ అయిదు వివేకాలని విడిచిపెట్టకుండా చూడగలిగేటటువంటి జీవితాన్ని కలిగివుండాలి. చాలా ముఖ్యం అండి. తెలియడం వేరు, జీవించడం వేరు. జీవించడంలో ఈ అయిదింటిని మనం వినియోగిస్తున్నామా లేదా? అనేది చూసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడెప్పుడైతే నీవు దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తావో, అప్పుడప్పుడు నీకు మళ్ళా మూడు అయిపోతావు.

            ఈ అయిదు వివేకాల యొక్క ప్రభావము ఏమిటంటే, ఈ మూడింటిని కలిపేస్తుంది. త్రిపుటి మొత్తాన్ని కలిపేస్తాయండి. అతే ఆ వివేకము అంటే అర్థము. త్రిపుటి ఏకత్రితమై ఒకటిగా వుండిపోతుంది. మూడుగా విడిపోదు ఇక. ఈ వివేకం లోనుంచి బయటకు వచ్చావనుకోండి, మళ్ళా మూడు అయిపోతుంది. అందులో మొదటి మూడు ఏమిటంటే, జగత్‌ జీవేశ్వరులే మొదటి త్రయం. అర్థమైందా అండీ! ఆ జగత్తు మళ్ళా ఎట్లా ఏర్పడిందయ్యా? మళ్ళా మూడు గుణాలు, మూడు అవస్థలు, మూడు శరీరాలు ఇలా మూడు మూడు మూడు చెప్పుకుంటూ పోతే, అవన్నీ అవే. కర్మ త్రయం, ఫల త్రయం అర్థమైందా అండీ! మనం కర్మను ఆచరిస్తున్నామా? లేదా? ఎలా ఆచరిస్తున్నాము? ఒక్కసారి ఆలోచించండి. మనం ఏమంటున్నాము? జీవులంత ప్రారబ్ధానుసారం వుండవలసిందే. అనేనా ప్రారబ్ధ నిర్ణయం? అసలు వుందా? అసలు వుందా? అని ప్రశ్న వేసుకోమన్నాడు. ప్రారబ్ధం అంటే ఏమిటి? పుర + ఆరబ్ధము. ప్ర అంటే పూర్వము. ఆరబ్ధము అప్పటినుంచి ఆరంభించి వుండి నీకు లభించింది. నువ్వే తెచ్చుకున్నావా? తెచ్చుకోలేదా? తెచ్చుకోకపోతే ఎలా వున్నావు మరి నువ్వు ఇలా? ఇలాగే ఎందుకు వున్నావు? మరోలాగా ఎందుకు లేవు? అంతేనా కాదా? మన చుట్టుప్రక్కల ఇంతమంది జీవులు వున్నారండి. ప్రతి ఒక్కడు ఎవడికి వాడు ఏమనుకుంటున్నాడు? నేను ప్రత్యేకం. నాకు వున్న జీవితం ఇంకొకడికి లేదు. నాకు వున్న సమస్యలు ఇంకొకడికి లేవు. నాకున్న పరిస్థితులు ఇంకొకడికి లేవు. ఈ పరిస్థితులు నీకు గనుక వుంటే నువ్వు కూడా ఇలానే వుంటావు. ఇవి ఉల్టా వాదన అన్నమాట. ఎవరైనా ఒకవేళ ఏదైనా చెప్పబోయారు అనుకోండి, మన దగ్గర గొప్పసమాధానము ఒకటి వుంటుంది. ఏమిటి? నాకున్న పరిస్థితులు నీకు వుంటే, నువ్వు కూడా ఇలానే వుంటావు. అంటే ఏమిటి? ఇంక నువ్వు చెప్పేది వినదలచుకోలేదు అన్నమాట. గురు ఉపదేశంతో ఆయనకు పనిలేదు. సాధరణంగా ఎవరైనా మరొకరికి ఏం చెప్పబూనుకుంటారండి? వాడున్న పరిస్థితి నుంచి బయటకు వచ్చే మార్గాన్ని అన్వేషణలో భాగంగా మాట్లాడుకుంటారు. అంతేనా కాదా? నిజానికి. కానీ మనం వినదలచుకోలేదనుకోండి? అప్పుడు ఏం చెప్తాం? అంతా విన్న తరువాత అయినా ఈ మాట అంటాడు. కొంచెం సత్వగుణంలో వుంటే, అదే రజోగుణంలో వుంటే, ఏం వినడు. మొదట్లోనే ఇవన్నీ నాకు తెలుసుకానీ, నాకున్న పరిస్థితులు నీకు వుంటే, నువ్వుకూడా ఇలాగే వుంటావు. అర్థమైందా అండీ!

            తమోగుణ సంపన్నుడు అసలు విననే వినడు. ఇలా మనం వున్నామా? లేదా? ఇలా అంతా ఎందుకు వున్నావు మరి ఇలాగ? చూడండి. అంటే, నీ దగ్గర ఏమి వున్నాయట అసలు? ఆ ఖర్మఫలాలు నీ దగ్గర ఏమి వున్నాయి? అని విచారణ చేసి చూస్తే, శరీరం వుందా లేదా? ప్రాణం వుందా లేదా? మనస్సు? అది కూడా వుంది. ఈ మూడింటిని ఇది కర్మఫలం చేత నీకు లభించింది అని నీకు నిర్ణయం కావాలి అనంటే, ఎలా వుపయోగించాలి? ఇది తెలియాలి. ఇప్పుడు మనం ఎలా వుపయోగిస్తున్నాము? అది కర్మఫలితంగా భావించి ఉపయోగించడం లేదు. ఆ మూడే నువ్వుగా వుపయోగిస్తున్నాము. శరీరమే నేను, ప్రాణమే నేను, మనస్సే నేనుగా ఉపయోగించేస్తున్నావు. అందువల్ల ఏమైపోయింది? ఇది కర్మఫలం అనేటటువంటి వివేకము అక్కడ పనిచేయడం లేదు. కాబట్టి ఈ మూడింటితో తపస్సు చేసే పద్ధతిలో, సాత్వికమైన పద్ధతిలో కనుక నీవు వీటిని ఉపయోగించినట్లయితే, నీకు ఒక స్ఫురణ తెలుస్తుంది. ఏమిటది? అంటే, ఈ మూడు కర్మఫలములు. అని తెలుస్తుంది. ఏం చేయడానికి వచ్చాయి? ఈ మూడు అసలు? ఇవి ప్రతి ఒక్క మానవుడికి వున్నాయా లేవా? ఏం చేయడానికి వచ్చాయి ఇవి? (కర్మఫలం అనుభవించడానికి వచ్చాయి) ఏమిటా కర్మఫలం? ధర్మ, అర్థ, కామ ఫల త్రయం. ఈ శరీరం ప్రాణం మనస్సు అవి కర్మ చేయడానికి వచ్చినాయట, పనిముట్లు. అవి మూడు పనిముట్లు. ఎవరి వల్ల వచ్చినాయి? కర్మ ప్రభావం చేత వచ్చినాయి అంటున్నాం. చేస్తే ఏమిటట ఫలితం రావాలా వద్దా? ఏమిటా ఫలితం? ధర్మం, అర్థం, కామం. ఈ మూడే ఫల త్రయం. నాల్గవదైన మోక్షం దృష్ట్యా ఈ ధర్మార్థ కామాలను నడిపితే, ఈ శరీర ప్రాణ మనస్సులు ఏం చెయ్యాలి? తపస్సు చేయాలి. ఈ మూడింటితో తపస్సు చేస్తే, ఆ తపస్సు ఏమై వుండాలట? ధర్మార్థ కామాలను మోక్షం దృష్ట్యా ఆచరించడమే తపస్సు అంటే. కాబట్టి నీ నిజజీవితంలో నీవు జీవించేటప్పుడు ధర్మం ప్రకారం జీవించాలా? అర్థం ప్రకారం జీవించాలా? కామం ప్రకారం జీవించాలా? అంటే ఈ మూడింటిని మోక్షం దృష్ట్యా జీవించినట్లయితే, ఈ శరీర ప్రాణ మనస్సులను తపింపజేసి వీటికి ఆధార భూతమైనటు వంటి కర్మబంధం నుంచి నీవు బయట పడవచ్చు. ఇదే నాయనా ముక్తి అంటే. అర్థమైందా అండి?

            మరలా ఈ శరీర ప్రాణ మనస్సులు కర్మ ప్రభావం చేత తయారవ్వకుండా వుండే పద్ధతిలోకి నువ్వు మార్పు చెందవచ్చు. ఈ కర్మబంధం లేనిది అని దృఢపడుతుంది నీకు. చాలా మంది ఏమనుకుంటారంటే ముక్తుడు అంటే ఏమిటి మన అభిప్రాయంలోఅంటే ఇతమిత్థంగా చెప్పలేరండి. “కర్మబంధ ప్రభావం లేకుండా నువ్వు శరీరంలో వుండడమే ముక్తుడంటే”. జీవన్ముక్తు అంటే అర్థం ఏమిటంటే? కర్మబంధం వలన నీకు ఏమి కలిగినాయి? శరీరం, ప్రాణం, మనస్సు. వాటిని ఆచరిస్తే ఏమి కలిగినాయి? ధర్మ అర్థ కామాలు. వీటి వలన నీకు బంధ త్రయం, మళ్ళా నీకు మూడు బంధాలు కలిగినాయి. ఏమిటది? జగత్‌ జీవేశ్వర భ్రాంతితో కూడినటువంటి బంధ త్రయం ఏర్పడింది. మరి ఈ కర్మ త్రయం, ఆ ఫల త్రయం, ఆ బంధ త్రయం వీటన్నింటిలో కూడా, ప్రపంచంలో ఎవరైనా ఏం చెబుతున్నారు అందుకోసమని? దుఃఖమిశ్రితం. నీ జీవితం అంతా ఏమిటి? దుఃఖమిశ్రితం. అదొక బంధం. కేవల సుఖమూ లేదు. కేవల దుఃఖము లేదు. అంటున్నామా లేదా? కాబట్టి ఏ రకంగా ఇదంతా పడుగుపేక అంటే మన మనోబుద్ధులలో అల్లుకుపోయిందన్నమాట. ఈ అల్లుకుపోయిన దానిలోనుంచి తత్వజ్ఞానమనే దృష్టితో చూడడం మొదలు పెట్టు.

            ఏమిటి తత్వజ్ఞానం? అంటే, అసలు ఈ గొడవా, గోలకు అంతా ఆధారం ఎవరండి? ఇవన్నీ తమంత తామే పనిచేస్తున్నాయా? మరొక ఆధారంతో పనిచేస్తున్నాయా? అసలు ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి అంటున్నావా? ఎవరి ఆధారంతో వున్నాయి? (ఈశ్వరుడు) అనే దాకా వెళ్ళు. ఆధార, ఆధేయ విమర్శ చెయ్యి మొట్టమొదట. ఈ గొడవకు అంతటికి ఆధారం ఏది? ఆధేయమేది? ఏది ఆధారంగా వుంది? ఏది ఆధారపడి వున్నది? అనే దానిని నువ్వు విమర్శ చేస్తే, నువ్వు చెబుతున్న శరీర ప్రాణ మనస్సులు ఈ ధర్మార్థ కామాలు ఆ మోక్షము ఈ తపస్సులు ఏవో రకరకాలు చెబుతున్నావు కదా! జగత్‌ జీవ ఈశ్వరులు అనీ, అది అనీ, ఇది అనీ. ఆ ప్రత్యేకతలు, ఈ ముక్కోటి దేవతలు, ఈ వ్రతాలు, ఆ జపాలు, ఈ తపాలు, ఈ సాధనలు, ఈ విషయానుభవాలు ఇవన్నీను ఇంతేగా జీవితం అంటే. ఎంత లెక్క వేసినా ఇంతేనా కాదా? శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే  ఐదు ఇంద్రియ విషయాల అనుభవాలు జీవితం అంతా ఇంతేనాఈ ఐదు కాకుండా ఇంకేమన్నా వున్నాయా? ఇంకేమీ లేవు. ఇదంతా నువ్వు వుండే చేస్తున్నావా? నువ్వు లేకుండా చేస్తున్నావా? నేను వున్నాను అనేటటుంవంటి ఆధారభూత స్థితి మీద ఇదంతా ఒకదానిమీద ఒకటి అల్లుకున్నాయి. నేను అన్నవాడు ఎవరో విచారణ చెయ్యి మొట్టమొదట. ఈ నేను వున్నాను అంటున్నాడే, ఈ వుండడం అనేది ఏంటి? నేను ఏమిటి? రెండే కదా!  మొదటి స్థితిలో వున్నాయి. అర్థమైందా అండీ? కాబట్టి నేను ఉన్నానుఈ ప్రాథమిక స్థితి మీదే ఇవన్నీ అల్లుకున్నాయి. కాబట్టి ఎక్కడ విచారణ చేయమంటుంది అష్టావక్రగీత? మొదటే చెప్పాడు. జ్ఞాత అహంకారం. మొదటి ప్రతిబింబం అహంకారం. ఈశ్వరుడు మొదటి ప్రతిబింబం జీవుడు. ఈశ్వరుడికి మొదటి ప్రతిబింబం ఎవరు? జీవుడు. ఇది అనేకం అయితే ఏమైంది? జగత్తు అయ్యింది. అర్థమైందా అండి? మొదటి ప్రతిబింబ స్థానంలోనే దీనిని విమర్శ చేసినట్లయితేనే నీవు దీనిని స్థిరంగా నిలబెట్టగలుగుతావు. ఇప్పుడు మనం ఎక్కడ విమర్శ చేస్తున్నామట? సాంతం ఫలిత రూపంలో వచ్చేసిన తరువాత, ఫలిత ప్రభావంలో వుండి విచారణ చేస్తున్నాము. అనేకత్వంలో కూడా కాదు. అనేకత్వాన్ని భోగిస్తూ భోగ ఫలమైనటువంటి ఫలాలలో విచారిస్తున్నాము. ఎక్కడ విచారణ చేయాట అసలిప్పుడు? కారణ ప్రతిబింబం. కారణంగా ఈశ్వరుడు వున్నాడు. అట్టి కారణ ప్రతిబింబం ప్రథమ ప్రతిబింబం అయినటువంటి జీవస్థానంలో విచారణ చేయమన్నాడు. కానీ ఎక్కడ విచారణ చేస్తున్నాము? ఈ జీవుడు అనేకంగా వున్నటు వంటి జగత్తును భోగిస్తూ అనుభవిస్తూ, అనుభవించి ఫలితాలలో భాగాలు అయినటువంటి సుఖదుఃఖమిశ్రితంలో విచారణ చేస్తున్నాము. ఎంతదూరం జరిగిపోయాము? అందువల్ల నీకు ఈశ్వర లక్షణంతో నిర్మించబడినటువంటి ఈ సృష్టిలో ఈశ్వరుడు కనబడడం లేదు. అర్థమైందా అండీ!

            కుండ కొనడానికి వెళ్ళారండి మీరు, సాధరణంగా. చూడండి కుండ కొనేవాళ్ళను గమనిస్తే, మీకు ఏం కనపడుతూ వుంటుంది? కుండ కొట్టి చూస్తారా లేదా? ఎందుకు? ఓటిదా? గట్టిదా? తెలుసుకోవడానికి. ఎందుకు నీకు అది? దాని వల్ల ఏమిటి ప్రయోజనము? అంటే మనస్సు దేంట్లో తిరుగుతోంది? Already అక్కడ కుండలో నీళ్ళు పోశావా? పొయ్యలేదు. కుండలో నీళ్ళు పోశారటండీ? పోయలేదు. లోపల అనుభవజ్ఞానంలో వుంది. కుండలో నీళ్ళు పోయడం, అది కారిపోవడం అనే అనుభవజ్ఞానం లోపల వుంది. ఇప్పుడు దేనితో బేరీజు వేస్తున్నావు, ఈ వర్తమానంలో కుండ verification ని? ఆ పూర్వకాలపు జ్ఞానంలో verify చేస్తున్నావు. అంతేనా కాదా? ఇప్పుడు కార్యం, కుండలో నీళ్ళు పోయడమనే కార్యం జరిగిందా? జరగలేదా? జరిగిందా? జరగలేదా? అంటే కారణ స్థితిలో జరిగిపోతున్నది. వస్తుతః కార్యంగా జరిగిందా అంటే జరగలేదు. అర్థమైందా అండీ? కాబట్టి మనవాళ్ళు ఏం చెప్పారు? వివాహ నిర్ణయం చేశాం, అంటే వివాహం అయిపోయినట్టే పో అన్నారు అంతే. మనమేమి అంటున్నాము. పెళ్ళి పెటాకులు అయినాక గానీ, వివాహం అవ్వలేదు అంటున్నాము. రోజూ మనకు complaint ఎవరితో? ఆయన అనువుగా లేడు, ఈయన అనువుగా లేడు అంతా కూడా, అసలు అనువుగా ఎందుకు వుండాలి? ప్రపంచంలో ఒకరికి ఒకరు అనువుగా ఎందుకు వుండాలి? నీవు ఈశ్వరుడికి అనువుగా వున్నావా? నువ్వు ప్రశ్న వేసుకో మొట్టమొదట. నీకు ఆధారం ఎవరు? ఈశ్వరుడు అండి. నీ జీవితం మొత్తం మీద ఎప్పుడైనా ఈశ్వరుడికి అనువుగా వున్నావా? నీవే, అసలు నీ ఉనికిలోనే తద్‌ వ్యతిరేకంగా వున్నావు. ఈ జీవుడు అనేవాడు ఎలా వున్నాడు? ఈశ్వరుడికి వ్యతిరేక ప్రతిబింబంగా వున్నాడు. ఎందుకని? నువ్వు అద్దంలో చూసుకో! ఎలా వున్నావు? నీ ప్రతిబింబం నీకు వ్యతిరేకంగా వుంది. కాబట్టి సృష్టి ధర్మం ప్రారంభంలోనే నువ్వు ఎలా వున్నావు? నీ ఉనికి లోనే నీవు ఎలా వున్నావు? ఈశ్వర లక్షణాలతో సమానంగా వుండవలసినటువంటి వాడివి ఏమయ్యావు? వ్యతిరేకంగా ప్రతిబింబం. అందువల్ల వ్యతిరేకమే సృష్టి ధర్మమై వున్నది. కానీ ఏం వెతుకుతున్నావు? జీవితం మొత్తం మీద? తగాదా అంతా ఇప్పుడు ఎక్కడ వచ్చింది? అసలు వుండేదే వ్యతిరేకతలురా బాబూ అని తెలుసుకున్నావనుకోండి, అప్పుడు ఇంక అనుకూలం గురించి ఏం వెతుకుతావు? ఈ అనుకూలతలను గూర్చి వ్యతిరేకతలను గూర్చి తగాదా పడే బదులు, నువ్వు అసలు దేనిని అన్వేషించాలట? నువ్వు దేనిమీద ఆధారపడి వున్నావో ఆ ఈశ్వరుడిని అన్వేషించే ప్రయత్నంలో వుండు. అప్పుడు ఈ వ్యతిరేకతలు అన్నీ ఏమైపోయినాయి? లేవుగా అప్పుడు. ఎందువల్ల లేకుండా పోయినా? ఇవన్నీ ఆ ఈశ్వరుడిలోనే కలిసిపోయినాయి. నీ అనుకూలతలు మీద వున్న అపేక్షకూడా అప్పుడు ఏమైపోయింది? అది కూడా లేకుండా పోయింది. ఇప్పటి వరకూ నీకు అనుకూలమైనవి అన్వేషించడమే సరిపోయింది జీవితం అంతా. ఎవరో ఒకరో ఇద్దరో అనుకూలంగా కనపడితో వాళ్ళతోనేమో మంచిగా మాట్లాడావు, మిగిలిన 98 వ్యతిరేకంగా వున్నారు కాబట్టి వాళ్ళతో చెడ్డగా మాట్లాడావు. ఇప్పుడు ఇవన్నీ ఎందులో కలిసిపోయినాయి ఒక్కసారిగా? ఆ ఈశ్వరలక్షణంలో కలిసిపోయినాయి. అర్థమైందా అండి? కాబట్టి నిజజీవితంలో మనం పుట్టింది మొదలు పోయేవరకు, జీవితాంతము వరకు ఒక పనే చేస్తున్నాము. ఏమిటది అంటే అనంత సృష్టిలో ఈశ్వరాన్వేషణ ఒక్కటే చేస్తున్నాము. జై బాబా !
  
[File no: MIC-2010-08-29_03h35m59s.mp3 over]